పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. ధానకర్ణుడు పివిజి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

మాన్సాస్‌ ట్రస్టుకు 15వేల ఎరాలు దానం చేసిన మహానుభావుడు
విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో రూ.124 కోట్ల డిపాజిట్‌
విజయనగరం, అక్షరదీక్ష ప్రతినిధి
మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్‌ పివిజి రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజయనగరంలో గజపతుల కోట ప్రాంగణంలో ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు జ్యోతి వెలిగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని పేర్కొన్నారు. విజయనగర మహారాజు అలక్‌ నారాయణ గజపతిరాజు, మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కుమారుడు పివిజి. చిట్టచివరి పట్టాభిషక్తుడైన రాజుగా చరిత్రలో నిలిచారు. రాజకోట (విజయనగరం కోట), ఉత్తర కోస్తా చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన ఆస్తిని విరాళంగా ఇచ్చారు. విజయనగరం సంస్థానానికి ఒడిశా నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఆస్తులను పైసా పరిహారం ఆశించకుండా ప్రభుత్వానికి దానం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన 15వేల ఎకరాలను మాన్సాస్‌ ట్రస్టుకు ఇచ్చారు. ఆయన కుమారుడే కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు.
విజయనగరానికి మహర్ధశ ఆయనవల్లే..
విద్యల నగరిగా విజయనగరం మారిందంటే ఆ మహారాజు దార్శనీకతే కారణం. సంగీత, సారస్వతాల్లో ఆయన అందించిన సహాయ, సహకారాల వల్లే ఎందరో ఆయా రంగాల్లో ఉన్నతంగా నిలిచారు. ఇంటి పెద్దగా వచ్చిన జ్యేష్ఠ భాగాన్ని ప్రజాధనంగా భావించి, రాజ్యంలో ఉన్న ఆస్తులు మొత్తాన్ని పివిజి దానమిచ్చారు. మాన్సాస్‌ ట్రస్టు పరిధిలో 105 దేవాలయాలు, 14,800 ఎకరాల భూములు, 13 విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల కోసం బ్యాంకుల్లో రూ.124 కోట్లు డిపాజిట్లు వేశారు. 60ఏళ్ల తర్వాత అన్నీ వదిలి సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. 1995 నవంబర్‌ 14న విశాఖలో కన్నుమూశారు.
ఆయన శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో అశోక్‌గజపతి రాజు సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తెలు అదితి గజపతిరాజు, విద్యావతి, మాన్సాస్‌ కరస్పాండెంట్‌ కెవిఎల్‌రాజు, విశ్రాంత ప్రధానాచార్యుడు ఎవిడి శర్మ, మహారాజా కళాశాల ప్రధానాచార్యుడు ఎం సాంబశివరావు, విద్యాసంస్థల పూర్వ ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు పుస్తకావిష్కరణ.
ఉత్సవాల్లో భాగంగా పివిజిపై రూపొందించిన ‘ది లాస్ట్‌ మహారాజా ఆఫ్‌ విజయనగరం’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఇందులో స్ఫూర్తివంతమైన ఆయన జీవితచరిత్రను పొందుపరిచినట్లు మాన్సాస్‌ వర్గాలు వెల్లడిరచాయి. హైదరాబాద్‌ బుక్‌ట్రస్టుకు చెందిన రచయితలు గీతా రామస్వామి, శశికుమార్‌, జయదీప్‌ ఈ పుస్తకం రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *