మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం ఆలయంలో పూజలు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి రంగంలోకి దిగారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. నేడు వరుణ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఆయనకు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి మెగా ప్రిన్స్ కు స్వాగతం పలికారు. అడుగడుగునా ఫ్యాన్స్ మెగా హీరో ని చూడడానికి ఎగబడ్డారు.
వరుణ్ తేజ్ కు ఏపీలో ఘన స్వాగతం మెగా ప్రిన్స్ కొణిదల వరుణ్ తేజ్ రాజమండ్రి విమానాశ్రయానికి వచ్చిన వెంటనే అక్కడ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటు, ఆయన తల్లి, మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సతీమణి పద్మ కూడా వచ్చారు. నాగబాబు వరుణ్ తేజ్ ను సాదరంగా స్వాగతించి అక్కడినుండి రోడ్డు మార్గాన పిఠాపురం వెళ్లారు.
కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వరుణ్ తేజ్ పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని వరుణ్ తేజ్, తన తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ అక్కడి నుండి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.
పవన్ కళ్యాణ్ విజన్ గొప్పది: వరుణ్ తేజ్ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విజన్ తో వస్తున్నారన్నారు . బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను స్వంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారన్నారు. ఆయన ఏపీ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారన్నారు.
బాబాయ్ గెలవాలని అమ్మవారిని ప్రార్ధించా : వరుణ్ తేజ్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బాబాయి రాజకీయాల్లోకి రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని, ఈ ఎన్నికల్లో బాబాయ్ విజయం సాధించాలని పిఠాపురం గుడిలో అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లో కష్టపడుతున్న తన బాబాయిని పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆదరించాలని కోరుతున్నాను అన్నారు