వీధి వ్యాపారి మోహినీ గౌడని కలిసిన మోడీ..

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటించారు. కర్ణాటకలోని సిరసి పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడ స్థానికంగా పండ్లు విక్రయించుకునే మోహిని గౌడ అనే మహిళతో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ కోంస ఆమె చేస్తున్న పనిని కొనియాడారు.
ఎవరీ మోహినీ గౌడ..
మోహిని స్వస్థలం ఉత్తర కన్నడ జిల్లా అంకోలాకు చెందిన హాలక్కి ప్రాంతం. అంకోలా బస్టాండ్‌లో ఆమె బుట్టలో పండ్లు విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అందరిలాగా కవర్లలో కాకుండా ఆకుల్లో పండ్లను అమ్ముతున్నారు. కొందరు ప్రయాణీకులు పండ్లను కొని తిన్న తర్వాత ఆకులను అక్కడే పడేసి వెళ్లిపోవడం మోహిణి చాలాసార్లు గమనించారు. ఎవరికో చెప్పడం ఎందుకని భావించిన ఆమె ఆ వ్యర్థాలను తానే సేకరించి చెత్త బుట్టలో వేయడం మొదలుపెట్టారు. చెట్ల నుంచి రాలిన ఆకులనూ ఊడ్చి పడేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆదర్శ్‌ హెగ్డే అనే వ్యక్తి ఆమె చేస్తున్న పనిని చూసి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఆ వీడియోను రీపోస్ట్‌ చేస్తూ మోహినిని ప్రశంసించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న నిశ్శబ్ధ హీరోలు వీరేనంటూ కొనియాడారు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఏ ఫలితాన్నీ ఆశించకుండా ఆమె చేస్తున్న ఈ పని నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మోహిని గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ గురువారం సిరిసి పర్యటన సమయంలో ఆమెను హెలిప్యాడ్‌ వద్ద కలిశారు. స్వచ్ఛ భారత్‌ కోసం ఆమె చేస్తున్న కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ వీడియోను ఆదర్శ్‌ హెగ్డే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *